Sunday, 15 July 2012

బ్రాంది షాపులను ప్రారంభిస్తున్న ఎం.ఎల్‌.ఎ.లు





గతంలో (సుమారు 20ఏళ్ల క్రితం) ప్రభుత్వసారా దుకాణాలుండేవి. కాలం మారింది. ఈ హైటెక్‌ కాలంలో మద్యం దుకాణాలను ఎపిబీసిఎల్‌ అవుట్‌లెట్ల పేరిట ప్రభుత్వమే నిర్వహించనుంది. నాడు సారాదుకాణాల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రులు వచ్చేవారు. నేడు ఈ కౌంటర్లు నేరుగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఎక్సయిజ్‌ పరిథిలో నిర్వహించే ఈ అవుట్‌లెట్లు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారే 637 ప్రారంభంకానున్నాయి. దీనికి కారణం ఈ 637మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు కాలేదు. మద్యం దుకాణాలు తీసుకోవటానికి ఎవరూ ముందుకు రాకపోవటంతో ప్రభుత్వమే నేరుగా నడపాలని నిర్ణయం తీసుకుంది. 



దీని వల్ల నిర్ణీతవేళల్లో కౌంటర్‌ సేల్స్‌ జరిపినా ఆదాయం తగ్గదని లెక్కలు కట్టింది. దీంతో ఎక్సయిజ్‌శాఖ నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. పదవీవిరమణ చేసిన ఉద్యోగులను సూపర్‌వైజర్లుగా నియమించి ముగ్గురిని అవుట్‌సోర్సింగ్‌గా తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం ఈపాటికే ఎక్కడెక్కడ అవుట్‌లెట్‌లు పెట్టాలనే విషయమై ప్రాంతాల వారీగా నివేదిక సిద్ధమైంది. జిల్లాల వారీగా ఎక్కడ అవుట్‌లెట్‌లు ప్రారంభించాలో వివరాలు కూడా పంపించారు. జిల్లాలోని ఎక్సయిజ్‌ డిసిలు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ అవుట్‌లెట్‌ల వల్ల బార్‌ల్లో  గంటల కొద్దీ చేసే కాలక్షేపాలకు, క్రైమ్‌కు చెక్‌ పెట్టవచ్చని ఎక్సయిజ్‌శాఖ కమిషనరు సమీర్‌శర్మ భావిస్తున్నారని తెలిసింది.

No comments:

Post a Comment