Sunday, 30 December 2012

ఆరోగ్యశ్రీ కిరణ్‌ మృతికి వైయస్‌ఆర్‌సిపి సంతాపం


 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి పి.ఆర్. కిరణ్‌ కుమార్ రెడ్డి(53) కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా దామర మడుగు. చిన్నతనం నుంచే సేవాతత్వం కలిగిన కిరణ్‌ కుమార్‌ రెడ్డికి దివంగత మహానేత డాక్టర్  వైయస్‌ రాజశేఖర రెడ్డితో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన వైయస్ఆర్‌కు  వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆరోగ్యశ్రీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి రోగులకు సాయం అందించారు. కిరణ్ కుమార్ రెడ్డి భౌతిక కాయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీమతి వైయస్. భారతి, వై.వి. సుబ్బారెడ్డి దంపతులు నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. 12.30 గంటల ప్రాంతంలో అంత్యక్రియల నిమిత్తం ఈఎస్ఐ సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళారు. పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలు కిరణ్ కుమార్ కు నివాళులర్పించారు
 కిరణ్‌ కుమార్‌రెడ్డి మృతి వ్యక్తిగతంగా తనకు, పార్టీకి తీరని లోటు అని వైయస్‌ఆర్‌సిపి సలహాదారు డిఎ సోమయాజులు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.‌ నిరుపేదల అభ్యున్నతి కోసం కిరణ్ కుమార్‌రెడ్డి నిరంతరం కృషిచేశారని ఆయన నివాళులు అర్పించారు.
దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి కిరణ్‌ కుమార్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా మంచి సేవలు అందించారని ఈ సందర్భంగా సోమయాజులు గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎంకు వివిధ సమస్యలపై వచ్చే అర్జీలు స్వీకరించడం, వాటిని క్రోడికరించడంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎనలేని కృషిచేసినట్లు తెలిపారు.  కిరణ్‌ కుమార్‌రెడ్డి సేకరించిన సమాచారమే నిరుపేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు అందించే ఆరోగ్య భద్రత పథకం రూపకల్పనకు దోహదం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆయన సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఏదైనా చేయాలని నిర్ణయించారని, దేశవిదేశాల్లోనూ విశేష ప్రసంశలు పొందిన ఈ సంక్షేమ పథకం అమలు‌ బాధ్యతను కిరణ్‌ కుమార్ స్వయంగా తన భుజస్కంధాలపై వేసుకున్నారని సోమయాజులు గుర్తు చేశారు.
సమాజం అభివృద్ధి కోసం విశేష సేవలు అందించిన కిరణ్‌ కుమార్‌రెడ్డి పార్థివదేహాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చి తుది నివాళులు అర్పించినట్లు సోమయాజులు ఆ ప్రకటనలో తెలిపారు.‌ పి.ఆర్. కిరణ్‌ కుమార్‌రెడ్డి దయార్ద్ర హృదయుడని, ఆయన చేసే ప్రతి పనిలోనూ మానవకోణాన్ని చూసేవారని నివాళులు అర్పించారు.

No comments:

Post a Comment